కాంగ్రెస్లో క్రమశిక్షణ లేకుంటే నష్టం....
కాంగ్రెస్లో క్రమశిక్షణ లేకుంటే నష్టం.. గీత దాటిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కోసం పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పార్టీ గీత దాటి వ్యవహరించే వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే నష్టం తప్పదని వ్యాఖ్యానించారు.
చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ క్యాబినెట్తో పాటు ప్రభుత్వంలోనూ కొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీలోని గ్రూపు తగాదాలను తగ్గించి, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పేదలకు అందించే పెన్షన్లను రూ.4 వేల వరకు పెంచాలని, రైతు భరోసా పథకాన్ని కొనసాగించాలని సూచించారు. 22ఏ భూముల సమస్యను పరిష్కరించాలని, ఉచిత పథకాలను తగ్గించి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని, పార్టీ క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తొలగించే చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ అంశాలపై దృష్టి పెడితేనే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.