నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం..
నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. సమయానికి వైద్యం అందక ఏడేళ్ల చిన్నారి మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆవేదన
నారాయణపేట జిల్లా: కొల్లంపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి చైత్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన ఘటన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
చిన్నారి చైత్రకు జ్వరం ఎక్కువ కావడంతో తండ్రి కమ్మరి వెంకటరాములు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే సుమారు ఐదు గంటల పాటు వైద్యం కోసం వేచి చూసినా వైద్యులు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
సకాలంలో చికిత్స అందక పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందిందని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఘటనపై ఆసుపత్రి అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.