విస్సన్నపేటలో వంట ఏజెన్సీలు, పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాల కోసం ధర్నా
విస్సన్నపేటలో వంట ఏజెన్సీలు, పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాల కోసం ధర్నా
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట:
వంట ఏజెన్సీలు, పాఠశాల పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీటీయూ అనుబంధ అఖిల భారత వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విస్సన్నపేటలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి మేకల కుమారి నాయకత్వం వహించారు.
ఈ ధర్నాలో ఏఐసీసీటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య, దుర్గం పుల్లారావు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ హాజరై మాట్లాడారు.
సుప్రీంకోర్టు పారిశ్రామిక వివాదాల చట్ట సవరణపై ఇచ్చిన తీర్పును ఆయన విమర్శించారు. ఈ తీర్పు కార్మిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్కీం వర్కర్లందరికీ కనీస వేతనం రూ.46 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పాఠశాల పారిశుధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలకు రావాల్సిన వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.
మధ్యాహ్న భోజన ఏజెన్సీలను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
అనంతరం విస్సన్నపేట మండల తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు.