షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కొల్లూరి సుధారాణి
ఏలూరులో భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. 16వ డివిజన్ శాఖ కార్యదర్శి ఉప్పులూరి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పతాకాన్ని ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ మహిళల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేసిన సంస్థగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూను కొనియాడారు. పోరాటాల ద్వారా సాధించిన మహిళా రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏలూరు ఏరియా ఉపాధ్యక్షురాలు గొర్లి స్వాతి మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఉప్పులూరి భవాని, రాజామణి, జ్యోతి, తాళ్లూరి సురేఖ, లక్కపాము ఝాన్సీ, పల్లిపాము సింధు, ఆలూరి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.