www.ntodaynews.com
రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు
తెలంగాణ
రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు
NTODAY NEWS: జగిత్యాల ఈ సీజన్లో ఇప్పటికే కేంద్రం నుంచి 5.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా గత సీజన్తో పోలిస్తే 92 వేల మెట్రిక్ టన్నులు అధికంగా యూరియా అమ్మకాలు 5 జిల్లాల్లో ఫెర్టిలైజర్ (యూరియా) యాప్ ప్రయోగం విజయవంతం కేవలం 9 రోజుల్లో యాప్ ద్వారా 2,01,789 యూరియా బస్తాల కొనుగోలు జిల్లా కలెక్టర్లతో మంత్రి, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీల వీడియో కాన్ఫరెన్స్ యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయకూడదు రాష్ట్ర రైతులకు రబీ సీజన్కు అవసరమైనంత యూరియా నిల్వ రాష్ట్ర ప్రభుత్వ వద్ద పూర్తిగా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఫెర్టిలైజర్ (యూరియా) యాప్ అమలు, యూరియా సరఫరా అంశాలపై చీఫ్ సెక్రటరీ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీలతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ రబీ సీజన్కు కేంద్ర ప్రభుత్వం మొత్తం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రావాల్సిన 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 5.70 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయని తెలిపారు.
గత సంవత్సరం ఇదే కాలంలో 2.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగగా, ఈ సీజన్లో రోజుకు సగటు 8,692 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 3.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారని, ఇది గత సీజన్తో పోలిస్తే 92 వేల మెట్రిక్ టన్నులు అధికమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వగా ఉందని పేర్కొన్నారు.
వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ (యూరియా) యాప్ను ఆదిలాబాద్, మహబూబ్నగర్, జనగామ, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో డిసెంబర్ 20 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ ఐదు జిల్లాల్లో 82,059 మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసి 2,01,789 యూరియా బస్తాలు కొనుగోలు చేశారని చెప్పారు. యాప్ ప్రారంభించిన కేవలం 9 రోజుల్లోనే రోజుకు 22,000కు పైగా బస్తాలు పంపిణీ అయినట్లు వెల్లడించారు.
యూరియా యాప్ అమలులో ఉన్న జిల్లాల కలెక్టర్లతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరిస్తున్నామని, రైతులు యాప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. యాప్ రైతుల సౌకర్యార్థం తీసుకువచ్చినదిగా, దీని ద్వారా యూరియా అమ్మకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు పత్తి అమ్మకాలు సులభంగా నిర్వహిస్తున్నారని, అదే తరహాలో ఈ యాప్ను ప్రవేశపెట్టినట్లు వివరించారు.
యాప్ అమలులో ఉన్న జిల్లాల్లోనూ, అమలులో లేని జిల్లాల్లోనూ యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా యూరియా స్టాక్, డిమాండ్, పంపిణీపై జిల్లా కలెక్టర్లు నిశితంగా పర్యవేక్షించాలని, అవసరమైతే అదనపు సేల్స్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించి, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో యూరియా లభ్యతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వ వద్ద రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల సౌకర్యార్థం వ్యవసాయ కమిషనరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అనంతరం చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలు ఉదయం వేళలకే తెరిచేలా చర్యలు తీసుకోవాలని, స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు సమీకరించి సాయంత్రం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ మాట్లాడుతూ, ప్రతి పీఏసీఎస్ కేంద్రంలో మూడు నుంచి నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, రైతుల సౌకర్యార్థం శామియానాలు, త్రాగునీటి వసతులు కల్పించాలని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, కోఆపరేటివ్ అడిషనల్ రిజిస్ట్రార్ చంద్రమోహన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube