టీఎస్ యూటీఎఫ్ నేత తేలుకుంట్ల వెంకటేశ్వర్లుకు ఘన నివాళి
నల్గొండ జిల్లా చిట్యాల మండల టీఎస్ యూటీఎఫ్ పూర్వ అధ్యక్షులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు అకాల మరణం సమాజానికి, ఉపాధ్యాయ సంఘాలకు తీరని లోటని మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వనస్థలిపురంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుకుడాల గోవర్ధన్ అధ్యక్షతన వెంకటేశ్వర్లు సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర్లు ఉన్నత విలువలు, అభ్యుదయ భావాలు కలిగిన ఆదర్శ ఉపాధ్యాయుడని, 2006లో చిట్యాలలో జిల్లా మహాసభల విజయవంతానికి ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర్లు తన 34 ఏళ్ల సర్వీసులో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఎంతో కృషి చేశారన్నారు. టాప్రా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ లింగా అరుణ మాట్లాడుతూ.. 65 ఏళ్ల వయసులోనూ ఆయన పెన్షనర్ల సమస్యలపై చురుగ్గా పోరాడారని కొనియాడారు. దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ మాట్లాడుతూ సమాజానికి ఎంతో సేవ చేయాల్సిన వెంకటేశ్వర్లు ఇంత త్వరగా దూరమవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్, టాప్రా రాష్ట్ర కార్యదర్శులు పెరుమాళ్ళ వెంకటేశం, ఎం. కృష్ణారావు, ఎడ్ల సైదులు, సురేందర్ రెడ్డి, మేడిశెట్టి వెంకటరమణ, మిర్యాల దామోదర్, రాములు, అంజిరెడ్డి, బుచ్చిరెడ్డి, అనంతరెడ్డి, రమేష్, వెంకట్ రెడ్డి, ముత్యాలు మరియు మృతుని కుమారుడు వేణు, కుమార్తె మౌనిక తదితరులు పాల్గొన్నారు.