టి. నరసాపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహణ
మొక్కలు నాటి పచ్చదనం పరిరక్షణకు పిలుపునిచ్చిన ఎస్ఐ ఎం. జయబాబు
టి.నరసాపురంలో జీవకోటి మనుగడకు పచ్చదనం పెంపొందించడమే శాశ్వత పరిష్కారమని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని టి. నరసాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం. జయబాబు పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం టి. నరసాపురంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయబాబు పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటి పచ్చదన పరిరక్షణకు సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వంలో అనేక గెలాక్సీలు, గ్రహాలు ఉన్నప్పటికీ జీవరాశి మనుగడకు అనుకూలమైన ఏకైక గ్రహం భూమి మాత్రమేనని అన్నారు. ప్రకృతి మనిషికి అనేక వరాలు ప్రసాదించిందని, అయితే ప్రకృతిని కాపాడేందుకు మనం ఎంత మేరకు కృషి చేస్తున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణానికి హాని కలిగించే చర్యల ఫలితంగా ప్రపంచం ఎన్నో విపత్తులను ఎదుర్కొంటోందని, కరోనా మహమ్మారి కూడా ప్రకృతితో మనిషి అసమతుల్య సంబంధానికి ఒక హెచ్చరికగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకం, వాటి సంరక్షణ అత్యంత అవసరమన్నారు.
అదేవిధంగా గండిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై అవగాహన పొందారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎస్.డి. నాసర్ పాషా, పింగుల మధు, పోలీసు సిబ్బంది వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పూసం అంజిబాబు, మద్దిరామయ్య, చిలక బాలయ్య, తాటి రాము, ఉపాధ్యాయులు దయానంద్ తదితరులు పాల్గొన్నారు.