టిడ్కో ఇళ్లు రాని వారికి డబ్బు వాపస్… సీఎం కీలక ఆదేశాలు
అమరావతి: గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన, కానీ ఫ్లాట్లు కేటాయింపులు జరగని సుమారు 83,865 మంది లబ్ధిదారులకు తమ చెల్లించిన రూ.174 కోట్లు తిరిగి ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా, నిర్మాణం పూర్తయిన 1,00,875 టిడ్కో ఇళ్లలో త్వరలోనే లబ్ధిదారులతో గృహప్రవేశాలు జరగనున్నారు.
బుధవారం అమరావతిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చందబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. 123 పురపాలక సంఘాల్లో మౌలిక వసతుల కల్పనకు 100 రోజుల ప్రణాళికను అమలు చేయాలని చెప్పారు. ప్రతి ఇంటికి QR కోడ్తో కూడిన డిజిటల్ డోర్ నంబర్ కేటాయించాల్సిందని, తాగునీటి కాలుష్యాన్ని నివారించేందుకు స్మార్ట్ వాటర్ పైప్లైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చేందుకు మరో 70 అన్న క్యాంటీన్లను త్వరగా ప్రారంభించాలని సూచించారు. వీటి నిర్వహణకు రాజస్థాన్, తమిళనాడులోని మోడళ్లను అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న 204 క్యాంటీన్లకు ఏటా రూ.167 కోట్లు ఖర్చు అవుతోంది. దాతలు, కార్పొరేట్ భాగస్వామ్యంతో ఈ క్యాంటీన్లను నడిపేలా చూడాలని అన్నారు.
పురమిత్ర యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల కారణంగా ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి, ఎమ్మెల్యే క్వార్టర్లను పరిశీలిస్తానని తెలిపారు.
సమీక్షలో మంత్రి నారాయణ సహా పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.