ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య
ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య
నూజివీడు: రాత్రి వేళల్లో జరిగే రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు నూజివీడు రూరల్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనల మేరకు నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్, రూరల్ ఎస్ఐ జ్యోతిబసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా రాత్రి సమయంలో రహదారులపై సంచరించే ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. చీకటి వేళల్లో దూరం నుంచే ట్రాక్టర్లు స్పష్టంగా కనిపించేలా ఈ స్టిక్కర్లు ఉపయోగపడతాయని, దీంతో ప్రమాదాల అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పోలీసులు తెలిపారు.
వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించిన అధికారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు. వాహనాలపై రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక లైట్లు వంటి భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా వ్యవసాయ వాహనాలు రాత్రి వేళల్లో ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. "వేగం వద్దు.. ప్రాణం ముద్దు" అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు.
"రహదారి నియమాలను పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం. వేగాన్ని నియంత్రిద్దాం.. సురక్షితంగా గమ్యానికి చేరుకుందాం" అని నూజివీడు రూరల్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.