ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ
మండుటెండల్లోనూ విధి నిర్వహణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె, జూన్ రోజురోజుకూ భగభగమంటున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రోడ్లపై నిరంతరం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు, శుక్రవారం మదనపల్లెలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ వేసవి రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా ఒక్కో సిబ్బందికి సూర్యుని ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను కాపాడే గాగుల్స్, తెల్లటి టోపీలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, స్టీల్ వాటర్ బాటిళ్లతో పాటు రెండు జతల ట్రాఫిక్ యూనిఫామ్లను ఎస్పీ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బంది యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకోవడంతో పాటు, మదనపల్లె పట్టణంలోని వివిధ రద్దీ కూడళ్లలో వారు నిర్వర్తిస్తున్న విధులపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ.. "తీవ్రమైన ఎండల్లోనూ ప్రజల భద్రత, సుగమమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం మీరు పడుతున్న శ్రమ అభినందనీయం. విధి నిర్వహణ ఎంత ముఖ్యమో, మీ ఆరోగ్య రక్షణ కూడా అంతే ముఖ్యం. ఎండ తీవ్రతను తట్టుకునేలా విధుల్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం, మంచినీరు తాగుతూ డీహైడ్రేషన్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి" అని సూచించారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లె ట్రాఫిక్ సీఐ గురునాథ్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ రవి, ట్రాఫిక్ మహిళా ఎస్ఐలు గాయత్రి, శివకామిణి, ఆర్ఎస్ఐ చంద్రశేఖర్ తదితర ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.