తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతుండటంతో పాటు, వాతావరణంలో ఏర్పడిన అనుకూల పరిస్థితుల ప్రభావంతో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గనున్నాయి.
ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. జూన్ 4 నాటికి అవి మరింత ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
అదేవిధంగా తూర్పు మధ్యప్రదేశ్, సమీప ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటం వల్ల రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈరోజు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగనుండగా, ఎల్లుండి చాలా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అలాగే ఈరోజు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది.