తెలంగాణలో వడదెబ్బ మరణాల లెక్కల్లో భారీ తేడా..
తెలంగాణలో వడదెబ్బకు బలవుతున్న వారి సంఖ్య విషయంలో ప్రభుత్వ లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం బయటపడింది.
2024 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేవలం 10 వడదెబ్బ మరణాలను మాత్రమే నమోదు చేయగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఏకంగా 116 మంది మృతి చెందినట్లు వెల్లడైంది.
అంటే సుమారు 106 మరణాలు ప్రభుత్వ అధికారిక లెక్కల్లో నమోదు కాకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అందించే రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా కోసం ఆ మరణం అధికారిక రికార్డుల్లో ఉండటం తప్పనిసరి.
దీంతో అనేక కుటుంబాలు ప్రభుత్వ సాయానికి దూరమవుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య నిర్ధారణ లోపాలు, అధికారిక ధృవీకరణ ప్రక్రియలో జాప్యం, స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే అనేక కేసులు నమోదు కాకుండా పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వడదెబ్బ మరణాల గుర్తింపు, నమోదు ప్రక్రియను మరింత సరళతరం చేసి పారదర్శకంగా అమలు చేస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.