తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ!
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేలాదిగా తరలివస్తున్న భక్తులతో కొండంతా కిక్కిరిసిపోయింది. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా, క్యూ లైన్ శిలాతోరణం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించింది. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 24 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే 78,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 45,283 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఇక శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.4.15 కోట్లకు చేరుకుంది. అలాగే 4.07 లక్షల లడ్డూలు విక్రయమవడం భక్తుల రద్దీకి అద్దం పడుతోంది.
వేసవి సెలవులు, వారాంతం కావడంతో రాబోయే రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.