తిరుమలపురంలో యాగంటి సుబ్రహ్మణ్యం స్మారక విగ్రహావిష్కరణ
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తిరుమలపురం గ్రామంలో మాజీ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ యాగంటి సుబ్రహ్మణ్యం స్మారక విగ్రహాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యాగంటి సుబ్రహ్మణ్యం సేవలను స్మరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ బలోపేతంతో పాటు గ్రామాభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం యాగంటి సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తదుపరి యాగంటి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యాగంటి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.