తిరుపతిలో కలకలం రేపిన కుళ్లిన మాంసం నిల్వలు – భారీ దాడుల్లో వెలుగులోకి నిజాలు
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారీగా కుళ్లిన మాంసం నిల్వలు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరపాలక సంస్థ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వందల కిలోల పాడైపోయిన మాంసం స్వాధీనం చేసుకున్నారు.
మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో 28వ వార్డు పరిధిలోని పెద్దపీర్ల చావడి మటన్ మార్కెట్, స్లాటర్ హౌస్లపై అధికారులు దాడులు చేశారు. సుమారు 15 దుకాణాల్లోని ఫ్రీజర్లను తనిఖీ చేయగా, రోజులు తరబడి నిల్వ ఉంచిన మేకలు, పొట్టేళ్ల భాగాలు పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టిన స్థితిలో లభ్యమయ్యాయి. మొత్తం 500 నుంచి 1000 కిలోల వరకు మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డ్లో ధ్వంసం చేశారు.
విచారణలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు నాణ్యత లేని మాంసాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేసి హోటళ్లు, బిర్యానీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.