తిరువూరు మున్సిపాలిటీ 13వ వార్డులో పారిశుధ్యం అధ్వానం....
తిరువూరు మున్సిపాలిటీ 13వ వార్డులో పారిశుధ్యం అధ్వానం.. అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు:
తిరువూరు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు మధిర రోడ్డు ఎస్సీ కాలనీలో పారిశుధ్య పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో పేరుకుపోయిన చెత్త, నిలిచిపోయిన మురుగునీరు, పెరిగిపోతున్న దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాలనీలోని పలు ప్రాంతాల్లో చెత్త సకాలంలో తొలగించకపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీనికి తోడు పందులు ఇళ్ల మధ్య సంచరిస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు తోడు కాలువల్లో మురుగునీరు నిలిచిపోవడంతో దోమల సంఖ్య పెరిగిందని, దీంతో విషజ్వరాల భయం నెలకొందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, దుర్వాసన నివారణ చర్యల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మురుగు పేరుకుపోయిన ప్రాంతాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలు కూడా చేపట్టడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పారిశుధ్య సమస్యలపై పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన కనిపించడం లేదని పేర్కొన్నారు.
సంబంధిత సచివాలయ సిబ్బంది, పారిశుధ్య విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కేవలం విధుల హాజరు నమోదు కోసమే వస్తున్నారా? లేక ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టి పెడతారా? అని ప్రశ్నిస్తున్నారు.
వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కాలనీలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, మురుగు కాలువలను శుభ్రం చేయాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇళ్ల మధ్య సంచరిస్తున్న పందుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజారోగ్యానికి ముప్పుగా మారకముందే అధికారులు చర్యలు చేపట్టి పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని 13వ వార్డు మధిర రోడ్డు ఎస్సీ కాలనీ ప్రజలు కోరుతున్నారు.