తిరువూరులో ఆరోగ్య కేంద్రాల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
తిరువూరులో ఆరోగ్య కేంద్రాల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు గర్భిణీల సేవలు, మాతా శిశు సంరక్షణపై పరిశీలన
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు:
తిరువూరు పట్టణంలోని బెస్తబజారు 8వ సచివాలయ పరిధిలోని ఆరోగ్య సేవలను జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న ప్రసూతి సేవలు, హైరిస్క్ గర్భిణీల గుర్తింపు, రక్తహీనత నివారణ చర్యలు, ప్రసవానంతర సేవల అమలుపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు.
జిల్లా గణాంకాధికారి లక్ష్మోజీ, జిల్లా ప్రోగ్రాం అధికారి మహేశ్వరరావు, జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సింగ్ అధికారి రేణుక, సీహెచ్వో కృష్ణకుమారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించి ఆరోగ్య శాఖ పర్యవేక్షకులు రవి, శ్యామల, ఏఎన్ఎం రమాదేవి నుంచి వివరాలు సేకరించారు.
ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
అనంతరం మండలంలోని మునుకుళ్ళ ఆరోగ్య కేంద్రాన్ని కూడా జిల్లా టాస్క్ఫోర్స్ బృందం తనిఖీ చేసి ఆరోగ్య సేవల అమలును పరిశీలించింది.