తిరువూరులో ఇంధన సంక్షోభం… పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ
తిరువూరులో ఇంధన సంక్షోభం… పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇంధన కొరత తీవ్రంగా మారింది. పట్టణంలోని నాలుగు పెట్రోల్ బంకుల్లో మూడు బంకులు ఫ్యూయల్ లేక మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఒక రిలయన్స్ బంక్ ముందు భారీగా క్యూ కట్టిన వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పెట్రోల్ బంకులు పూర్తిగా మూసివేస్తారన్న వదంతులు వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవాలని భావిస్తూ బంకుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. దీంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ఇక ఆయిల్ కంపెనీలు క్రెడిట్ సప్లై నిలిపివేయడంతో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూతపడినట్లు సమాచారం. ఈ సమస్య త్వరగా పరిష్కరించకపోతే రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.