తిరువూరులో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ
తిరువూరు, ఆగస్టు 2: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ సమత, లెజెండ్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ గంపలగూడెం–డైమండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సమత అధ్యక్షుడిగా పి.వి. రావు, లెజెండ్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ గంపలగూడెం–డైమండ్స్ అధ్యక్షుడిగా చిత్తలూరి జగదీష్, ఇతర బాధ్యతలను నాళ్లా విజయలక్ష్మి కుమారి, కుందా నాగభూషణరావు స్వీకరించారు. నూతన కార్యవర్గ సభ్యులతో లయన్ లింగం శివశంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించాలని, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సేవలందిస్తూ సమాజ అభ్యున్నతికి లయన్స్ క్లబ్ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మాజీ జిల్లా గవర్నర్లు ఎస్.వి.ఎన్. నివృత్తరావు, జేయన్ శంకర్ గుప్తా, దేవినేని కిషోర్ పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, గంపలగూడెం ప్రాంతాలకు చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రముఖులు, సేవా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.