తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే విద్యాభివృద్ధి: ఎంఈవో మాసగిరి శ్రీనివాస్
ఏలూరు జిల్లా, చాట్రాయి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పీటీఎం–4.0 కార్యక్రమం చాట్రాయి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయంగా సమావేశమై విద్యార్థుల చదువు, క్రమశిక్షణ, హాజరు, ప్రతిభ, విద్యా పురోగతిపై సమగ్రంగా చర్చించారు.
మండలంలోని జెడ్పీహెచ్ఎస్ చాట్రాయి, మంగపేట, టీ.గుడిపాడు, పోతనపల్లి ఎస్ఎల్టీఎస్, ఎంపీపీఎస్ చాట్రాయి మెయిన్ పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఎంఈవో–1 మాసగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట పడుతుంది. ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం ద్వారా అందించిన నగదును పిల్లల విద్య కోసం వినియోగించాలి. ప్రతి విద్యార్థిని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ వారి చదువుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలి" అని సూచించారు.
మంగపేట ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు గణేష్ తన సొంత నిధులతో పాఠశాలకు మరమ్మతులు చేయించి, ఆకర్షణీయంగా రంగులు వేయించి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించినందుకు ఎంఈవో మాసగిరి శ్రీనివాస్ ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఉపాధ్యాయుడు ఇదే స్ఫూర్తితో ముందుకు రావాలని ఆకాంక్షించారు.
అనంతరం చాట్రాయి భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ప్రత్యేక కిట్లను పంపిణీ చేసి, వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మందపాటి బసవా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, మెగా పీటీఎం వంటి కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని అన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసే దిశగా సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు విలువలు, క్రమశిక్షణ పెంపొందించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
నేతలు కన్నెగంటి కనికంటి.శంకర్ రావు, ధారావతు.భాస్కరరావు, లావూరి.వెంకటేశ్వరరావు, సవరం రామారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పాల్గొన్నారు.