తమిళనాడులో సంచలనం సృష్టించిన తూత్తుకుడి కస్టడీ హత్యల కేసు
తమిళనాడులో సంచలనం సృష్టించిన తూత్తుకుడి కస్టడీ హత్యల కేసులో చివరకు న్యాయం వెలుగుచూసింది.
2020 లాక్డౌన్ సమయంలో సాతంకుళంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాత్రి 9 గంటల తర్వాత మొబైల్ షాప్ తెరిచి ఉంచాడన్న కారణంతో పోలీసులు జయరాజ్ను స్టేషన్కు తీసుకెళ్లగా, ఆయనను చూడటానికి వచ్చిన కుమారుడు బెన్నిక్స్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఆ రాత్రంతా స్టేషన్లో వారిద్దరిపై అమానుషంగా హింస కొనసాగింది. చెక్క టేబుల్కు కట్టివేసి లాఠీలతో దారుణంగా కొట్టినట్లు తరువాత వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాల కారణంగా జూన్ 22న బెన్నిక్స్, జూన్ 23న జయరాజ్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించారు. మొదట పోలీసులు ఎఫ్ఐఆర్లో తండ్రీకొడుకులే దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నా, దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ వాదనలు అబద్ధమని తేలింది.
సుదీర్ఘంగా ఆరు సంవత్సరాల విచారణ అనంతరం, మదురై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు సహా మొత్తం 9 మంది పోలీసులను హత్య కేసులో దోషులుగా నిర్ధారించింది.
ఈ కేసులో శిక్ష ఖరారు మార్చి 30న ప్రకటించనున్నారు.
ఆరు సంవత్సరాల తర్వాత అయినా న్యాయం జరిగిందన్న భావన ఉన్నా, ఈ ఘటన దేశంలో కస్టడీ హింసపై మరొకసారి తీవ్రమైన చర్చకు దారితీసింది.