తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి సీతక్క
మహబూబాబాద్లో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా తప్పు చేస్తే చట్టం ముందు శిక్ష అనివార్యమని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తాత్సారం చేయలేదని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కారణంగా కేసు నమోదు ప్రక్రియలో ఒక్క రోజు ఆలస్యం జరిగిందని అంగీకరించిన సీతక్క.. సిట్ ఏర్పాటు కాలయాపన కోసం కాదని, నిజానిజాలు బయటకు తీసుకురావడానికేనని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంతటి స్థాయిలో ఉన్నా పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు.
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు మహిళలను గౌరవించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సీతక్క సూచించారు.
ఇదిలా ఉండగా, బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం. బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా, వ్యక్తిగత కారణాలతో ఈ నెల 15న హాజరవుతానంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు, సిట్ అధికారులకు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపినట్లు తెలిసింది.