www.ntodaynews.com
గిరి ప్రదక్షిణ మార్గం సాకారం కావాలి
తెలంగాణ
సమష్టిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం
NTODAY NEWS: కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం సాకారం కావాలి పనులు ప్రారంభిస్తే స్వయంగా వచ్చి కరసేవ చేస్తా ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన టీటీడీకి ధన్యవాదాలు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ఆంజనేయస్వామి అందరి దేవుడు, విశ్వాంతర్యామి. ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే చెందిన దేవుడు కాదు. మా ఇలవేల్పు ఆంజనేయస్వామికి సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సాకారం చేద్దాం. అందరూ కలిసి స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దాం” అన్నారు. రామభక్తులు సంకల్పిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని పేర్కొంటూ, కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానని తెలిపారు. బలమైన సంకల్పంతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు బోర్డు తగిన సహకారం అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రూ.35.19 కోట్లతో అభివృద్ధి పనులు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో వసతి సముదాయం, దీక్ష విరమణ మండపం నిర్మాణాలకు శనివారం శంకుస్థాపన జరిగింది.
ఈ నిధులతో:
96 గదుల వసతి సముదాయం, ఒకేసారి 2,000 మంది భక్తులు దీక్షలు విరమించుకునే భారీ మండపం
అందుబాటులోకి రానున్నాయి. 2024 ఎన్నికలకు ముందు వారాహి యాత్ర ప్రారంభ సమయంలో కొండగట్టు ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మరియు మాలధారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆలయ అధికారులు, వేద పండితులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతో ఈ నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
గిరి ప్రదక్షిణపై ప్రత్యేక వ్యాఖ్య
“కొండగట్టు క్షేత్రం తెలంగాణకు రక్షణ కవచంలా ఉంటుంది. గిరి ప్రదక్షిణకు ప్రయత్నం మొదలుపెట్టండి. నేను స్వయంగా వచ్చి కరసేవ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. అంతా సమష్టిగా ఆలయ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ ఎండోమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనందసాయి, మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్ఏసీ ఛైర్మన్ శంకర్ గౌడ్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube