www.ntodaynews.com
అనధికార పత్తి విత్తనాల అమ్మకాలను అరికట్టాలి
తెలంగాణ
అనధికార పత్తి విత్తనాల అమ్మకాలను అరికట్టాలి
- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు NTODAY NEWS: హైదరాబాద్ రాష్ట్రంలో అనుమతిలేని, అనధికార పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను కఠినంగా అరికట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి విత్తనాల విక్రయాలపై వ్యవసాయశాఖ సంచాలకులతో సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అనుమతిలేని HT (Herbicide Tolerant) పత్తి విత్తనాలను రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. HT / BG-III పత్తి రకాన్ని అమెరికాకు చెందిన మోన్సాంటో అభివృద్ధి చేసినప్పటికీ, ఫీల్డ్ ట్రయల్స్లో విఫలమవడం, పర్యావరణానికి కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ విత్తనాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అయినప్పటికీ కొందరు దళారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులకు HT పత్తి విత్తనాలను అనధికారికంగా అంటగడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 అధీకృత పత్తి విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి చేస్తున్నాయని, ప్రభుత్వం సర్టిఫై చేసిన మరో 40 కంపెనీలు రాష్ట్రానికి పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేస్తున్నాయని చెప్పారు. గత సంవత్సరం ఈ కంపెనీల ద్వారా సరఫరా అయిన సుమారు 1.10 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన HT విత్తనాలతో పాటు కల్తీ విత్తనాలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అక్రమాలకు ఆస్కారం ఉందని అన్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల నుంచే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి, పత్తి విత్తనాల అక్రమ రవాణాపై కఠిన నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కో-మార్కెటింగ్కు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని కూడా సూచించారు.
HT పత్తి విత్తనాలను రైతులు కొనకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు. కలుపును తట్టుకుంటాయని, అధిక దిగుబడి వస్తుందనే ప్రచారాన్ని నమ్మి HT పత్తి విత్తనాలను కొనవద్దని రైతులను కోరారు. ఈ విత్తనాల వాడకం వల్ల అధికంగా కలుపుమందుల వినియోగం జరుగుతుందని, దీని కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలగడంతో పాటు జీవ వైవిధ్యం దెబ్బతిని, ఇతర పత్తి హైబ్రిడ్ పంటలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని వివరించారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సంచాలకులు డా. గోపితో పాటు వ్యవసాయశాఖ అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube 