ఉద్యోగ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడు షేక్ మహమ్మద్ ఆలీకి ఘన సన్మానం
ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించిన షేక్ మహమ్మద్ ఆలీ ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన సభ ఘనంగా జరిగింది. విద్యారంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చాట్రాయి ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్ ప్రత్యేకంగా పాల్గొని షేక్ మహమ్మద్ ఆలీని శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన సన్మాన పత్రాన్ని స్వయంగా చదివి అందజేస్తూ ఆయన విద్యార్థుల అభివృద్ధి, పాఠశాల పురోగతి కోసం చేసిన కృషిని కొనియాడారు.
సభకు ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ–తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన షేక్ మహమ్మద్ ఆలీ సేవలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
ఈ సందర్భంగా చాట్రాయి ఎంఈవో-1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, మూడు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో షేక్ మహమ్మద్ ఆలీ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, ఉపాధ్యాయులతో సమన్వయం, సమాజంతో అనుబంధం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. పదవీ విరమణ ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, సమాజ సేవకు అది కొత్త ఆరంభమని పేర్కొంటూ ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందమయమైన జీవితం కలగాలని ఆకాంక్షించారు.
ఈ సన్మాన సభలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొని షేక్ మహమ్మద్ ఆలీకి శుభాకాంక్షలు తెలియజేశారు.