ఉక్కపోతలో ఉడికిపోతున్న విద్యార్థులు.. ఒంటిపూట బడులు లేదా సెలవులు ఇవ్వాలంటున్న తల్లిదండ్రులు..!
ఉక్కపోతలో విద్యార్థుల ఇబ్బందులు.. ఒంటిపూట బడులు లేదా సెలవులు పొడిగించాలంటున్న తల్లిదండ్రులు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో గత రెండు రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు రోజువారీగా బడులకు హాజరవుతున్నారు.
తీవ్ర వేడిమి కారణంగా తరగతుల్లో విద్యార్థులు కూర్చోవడం కూడా కష్టంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు అలసటకు గురవుతున్నారని పేర్కొంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలకు మరికొంతకాలం సెలవులు ప్రకటించాలా లేదా ఒంటిపూట బడుల విధానం అమలు చేయాలా అనే విషయంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
వాతావరణ పరిస్థితులు ఇంకా కొనసాగితే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.