ఉపాధి శ్రామికులకు శుభవార్త.. పెరిగిన కూలీ, 125 రోజులకు పెరిగిన పనిదినాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం కింద పనిచేసే గ్రామీణ శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఉపాధి కూలీల రోజువారీ వేతనాన్ని పెంచడంతో పాటు, పనిదినాలను కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు రోజుకు రూ.300గా ఉన్న వేతనాన్ని తొలుత రూ.307కు పెంచిన ప్రభుత్వం, తాజాగా మరోసారి సవరిస్తూ రూ.312గా నిర్ణయించింది. అలాగే, ప్రస్తుతం అమల్లో ఉన్న 100 రోజుల ఉపాధి హామీ పనులను 125 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనులు తగ్గిపోయే వర్షాకాలం, ఇతర నిరుద్యోగ సమయాల్లో ఈ అదనపు 25 రోజుల పని శ్రామికులకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది.
పని దినాలు పెరగడం, కూలీ రేటు పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసాను మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి కూడా దోహదపడనుంది.
ఈ నిర్ణయంపై ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న చర్య తమ కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు.