వాహనదారులపై పెను భారం
వాహనదారులపై పెను భారం : లీటరు పెట్రోలు, డీజిల్పై రూ. 3 పెంపు NTODAY NEWS హైదరాబాద్
సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరుపై ఏకంగా 3 రూపాయల మేర భారం మోపడంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తెలంగాణలో మే 15 శుక్రవారం
ఉదయం 6 గంటల నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో తెలంగాణలో చమురు ధరలు సెంచరీ దాటి మరింత పైకి ఎగబాకాయి తెలంగాణలో లీటర్ పెట్రోల్: 110.89 రూపాయలు లీటర్ డీజిల్: 98.96 రూపాయలుగా ఉన్నాయి అంతర్జాతీయ పరిణామాలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు: ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోవడం ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేసింది. గత రెండేళ్లుగా ధరలు పెంచకపోవడంతో కలిగిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యుడిపై ఇది గోరుచుట్టుపై రోకలిపోటు లాంటిదని చెప్పవచ్చు. మరి ప్రభుత్వం పన్నుల తగ్గింపు ద్వారా ఏమైనా ఊరటనిస్తుందో లేదో వేచి చూడాలి.