వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల అప్రమత్తత
వేసవి సెలవుల్లో దొంగతనాల పట్ల అప్రమత్తతపై చాట్రాయి పోలీసుల మైక్ అనౌన్స్మెంట్ ప్రచారం
చాట్రాయి, మార్చి 31:
వేసవి సెలవుల నేపథ్యంలో గ్రామాల్లో దొంగతనాలు, ఆస్తి నేరాలను అరికట్టడమే లక్ష్యంగా చాట్రాయి పోలీసులు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేకంగా మైక్ అనౌన్స్మెంట్ కార్యక్రమం నిర్వహించారు.
చాట్రాయి ఎస్ఐ శ్రీ డి. రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మండలంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో తిరుగుతూ మైక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. ముందస్తు జాగ్రత్తలే రక్షణకు మార్గమని, నేరం జరిగిన తర్వాత బాధపడటంకంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
వేసవిలో ఇళ్లకు తాళం వేసి బయలుదేరే వారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటి యజమానులు, వ్యాపారులు తమ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను 90 శాతం వరకు అరికట్టవచ్చని, నేరస్తులను గుర్తించడం సులభమవుతుందని వివరించారు.
గ్రామాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి కదలికలపై నిఘా ఉంచాలని, అవసరమైతే వారి వివరాలను సేకరించాలని కోరారు. ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినా, అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీస్ శాఖ ప్రధాన కర్తవ్యమని, సెలవుల కాలంలో రాత్రి గస్తీని మరింత ముమ్మరం చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి, స్వీయ రక్షణ చర్యలు పాటిస్తే నేరరహిత మండలాన్ని నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.