వడ్డెర్లకు మైనింగ్ లీజులు... యువగళం హామీకి న్యాయం చేసిన మంత్రి నారా లోకేశ్
వడ్డెర్లకు మైనింగ్ లీజులు... యువగళం హామీకి న్యాయం చేసిన మంత్రి నారా లోకేశ్
రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వారి సంప్రదాయ వృత్తిని ప్రోత్సహిస్తూ, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడ్డెర వర్గానికి చెందిన ప్రజలు లోకేశ్ను కలిసి తమ సమస్యలను వివరించారు. రాళ్లు కొట్టడం, మట్టి పనులు వంటి తమ సంప్రదాయ వృత్తులకు అనుగుణంగా ప్రభుత్వ భూముల్లో మైనింగ్ లీజులు ఇస్తే జీవనోపాధి మెరుగుపడుతుందని కోరారు. ఆ సమయంలో స్పందించిన లోకేశ్, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీ ప్రకారమే ఇటీవలి కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదనగా తీసుకువచ్చిన నారా లోకేశ్, వడ్డెర వర్గం ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. దీనిపై సమగ్రంగా చర్చించిన మంత్రివర్గం, సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు, విధివిధానాలతో త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయనుంది.
యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న లోకేశ్, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది వడ్డెర కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.