వీఆర్వోకు అస్వస్థత.. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కుప్పకూలిన పార్థసారథి
వీఆర్వోకు అస్వస్థత.. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కుప్పకూలిన పార్థసారథి
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం – విస్సన్నపేట
విస్సన్నపేట తహసీల్దార్ కే.లక్ష్మి కళ్యాణి సమక్షంలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. విస్సన్నపేట సచివాలయం-1లో వీఆర్వోగా పనిచేస్తున్న పర్వతం పార్థసారథి ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలి పడిపోయారు.
అనారోగ్యంగా ఉన్నప్పటికీ విధి నిర్వహణ పట్ల బాధ్యతతో పార్థసారథి కార్యాలయానికి హాజరయ్యారు. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో ఆయన స్పృహ తప్పి కిందపడిపోయినట్లు తెలిసింది.
వెంటనే స్పందించిన తహసీల్దార్ కే.లక్ష్మి కళ్యాణి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం పార్థసారథిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. విధి పట్ల నిబద్ధతతో అనారోగ్యాన్ని లెక్కచేయకుండా హాజరైన వీఆర్వో పార్థసారథికి సహచర ఉద్యోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.