వెలుగు పేరిట చీకటి దోపిడి..!
వెలుగు మాటున చీకటి జాడలు..!
మహిళల పొదుపు సొమ్ముల మాయం సేవ పేరుతో సొమ్ముల సఫాయం..! వెలుగు అధికారుల దందా బయటపడ్డదా?
ముచ్చినపల్లి మహిళల పొదుపు సొమ్ములు మాయం – వెలుగు అధికారులపై తీవ్ర ఆరోపణలు
రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో “వెలుగు” పేరుతో వెలుగులు నింపాల్సిన వ్యవస్థే… మహిళల జీవితాల్లో చీకట్లు నింపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా కష్టపడి రూపాయి రూపాయిగా పొదుపు చేసిన సొమ్ములు… ఒక్కసారిగా ఖాతాల నుంచి మాయమవ్వడం స్థానిక మహిళలను ఆందోళనకు గురిచేసింది.
“మాకు చెప్పకుండా… మా సంతకాలు లేకుండా… మా ఖాతాల్లోని డబ్బు ఎలా బయటకు వెళ్లింది?” అంటూ బాధిత మహిళలు బ్యాంకులు, అధికారుల ఎదుట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఒకప్పుడు “మీ కష్టానికి మేముంటాం… మీ జీవితాల్లో వెలుగు నింపుతాం…” అంటూ ప్రభుత్వ హామీలతో ప్రారంభమైన వెలుగు కార్యక్రమం, ఇప్పుడు అదే మహిళల కష్టార్జితాన్ని మింగేస్తోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రుణాలు, స్వావలంబన పేరుతో మహిళలను సంఘటితం చేసి, వారి నమ్మకాన్ని గెలుచుకున్న వ్యవస్థలోనే… ఈ విధమైన అక్రమాలు వెలుగుచూడటం సంచలనంగా మారింది. అధికారుల నిర్లక్ష్యమా? లేక వ్యవస్థలోనే దాగి ఉన్న అవినీతికి ఇది నిదర్శనమా? అన్నది తేలాల్సి ఉంది.
“పొదుపు చేసిన డబ్బు కూడా సురక్షితం కాకపోతే… మేమెవరిని నమ్మాలి?” అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.