విద్యార్థుల కొరతతో 167 ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు..!
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం 167 ప్రభుత్వ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరంలో మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో వరంగల్ జిల్లాలో 131, హనుమకొండ జిల్లాలో 36 పాఠశాలలు ఉన్నాయి.
నెక్కొండ మండలంలో అత్యధికంగా 28 పాఠశాలలు మూతపడుతుండగా, చెన్నారావుపేట మరియు రాయపర్తి మండలాల్లో చెరో 16 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి తగ్గడం, ప్రైవేట్ విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీసినట్లు భావిస్తున్నారు.
ఒకేసారి 167 పాఠశాలలు మూతపడుతుండటంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ భవిష్యత్తుపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య అందుబాటుపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశముందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.