విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులే లక్ష్యం
విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులే లక్ష్యం
కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, పరిశుభ్రమైన వసతులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హాజీపూర్ మండలం కర్ణమామిడి, లక్షెట్టిపేట, దండేపల్లి మండలం కర్ణపేటలోని కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, హాజరు రిజిస్టర్లు, వంటశాల, త్రాగునీటి వసతులను నిశితంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి బోధన, వసతులపై ఆరా తీశారు. వారితో పాటే కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను స్వయంగా పరీక్షించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాఠశాలలు, వసతి గృహాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. పైప్లైన్ల లీకేజీలు అరికట్టి, క్లోరినేషన్ చేసిన సురక్షిత నీటినే అందించాలన్నారు. హాజీపూర్ మండలంలోని కర్ణమామిడిని సందర్శించి, మురుగు కాల్వల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. అలాగే, శిథిలావస్థలో ఉండి కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లను గుర్తించి, ఆయా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. లక్షెట్టిపేట కేజీబీవీ పరిసరాల్లో వీధిదీపాలు వెలగకపోవడంపై స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో తక్షణమే మరమ్మతులు చేయించారు. ఈ పర్యటనలో మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సుమన్, మండల విద్యాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ప్రత్యేక అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులతో పాటు మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు