విధి వంచిన పోలీసు అధికారి.. రోడ్డు ప్రమాదంలో సీఎం భద్రతా విభాగం గన్మెన్ కిరణ్ మృతి
హైదరాబాద్, జూలై 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విభాగంలో గన్మెన్గా విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ కిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.
2009 బ్యాచ్కు చెందిన కిరణ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్గా చేరి తన విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో గుర్తింపు పొందారు. వివిధ కీలక ప్రజాప్రతినిధుల భద్రతా విభాగంలో సేవలందించిన ఆయన, ప్రస్తుతం ముఖ్యమంత్రి భద్రతా బృందంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గతంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి వద్ద గన్మెన్గా పనిచేశారు. అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి భద్రతా బృందంలో కూడా సేవలందించారు. తన క్రమశిక్షణ, సమర్థతతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందిన కిరణ్, వృత్తిపరంగా మంచి పేరు సంపాదించుకున్నారు.
సిద్దిపేట సమీపంలోని గ్రామానికి చెందిన కిరణ్, సిద్దిపేటలో డిగ్రీ విద్య పూర్తిచేసి పోలీసు శాఖలో చేరారు. విద్యార్థి దశ నుంచే చురుకైన వ్యక్తిత్వం కలిగిన ఆయన, సహచరులతో ఆప్యాయంగా మెలిగే స్వభావం వల్ల అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఎలాంటి ఒత్తిడి పరిస్థితుల్లోనూ చిరునవ్వుతో విధులు నిర్వహించేవారని సహోద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు.
చిన్న వయసులోనే కిరణ్ మృతి చెందడం పట్ల పోలీసు అధికారులు, సహచరులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.