విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్లో డీసీపీ తనిఖీలు – రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం డీసీపీ గుణ్ణం రామకృష్ణ తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి, భవానిపురం ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు.
వర్షాకాలం నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలు, ఈదురు గాలులు, భారీ వర్షాల సమయంలో ప్రజలకు కలిగే ఇబ్బందులు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై డీసీపీ సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అనంతరం రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత సమస్యలు ఉంటే పోలీసులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని సూచించారు.
కుటుంబ బాధ్యతలను గుర్తించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా కష్టపడి పనిచేసి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. సత్ప్రవర్తనతో మెలిగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పించేందుకు అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐ ఉమామహేశ్వరరావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.