విజయవాడలోఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డిసిపి షిరీన్ బేగం పర్యవేక్షణలో వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా 5వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి.వి. రమణ తన సిబ్బందితో కలిసి బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ హాల్లో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, పాఠశాల విద్యార్థులను స్కూల్ ఆటోలలో సురక్షితంగా రవాణా చేయాల్సిన అవసరం, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రతి వాహనదారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు సూచించారు. రహదారి వినియోగదారుల భద్రత కోసం బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని స్పష్టం చేశారు.
అనంతరం ఆటో డ్రైవర్లు మరియు ఆటో యూనియన్ నాయకులతో ట్రాఫిక్ నియమాలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్కు దూరంగా ఉండడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో 5వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ డి.వి. రమణ, ఎస్ఐ మురళి రెడ్డి, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మరియు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.