వికసిత భారత్-2047 లక్ష్య సాధనలో మహిళల పాత్ర కీలకం
ముసునూరులో వికసిత భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు, జూలై 2: దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే "వికసిత భారత్-2047" లక్ష్య సాధనలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, మహిళల ఆర్థిక సాధికారతకు "వికసిత భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)" పథకం గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, కమలాలక్ష్మి దంపతులు, జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి కలిసి ఫీడర్ ఛానల్ పనులకు భూమిపూజ చేసి, గుణపంతో త్రవ్వి పనులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామసభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ ద్వారా ప్రతి అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 125 రోజుల చట్టబద్ధమైన వేతన ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రజలకు స్థిరమైన ఉపాధితో పాటు జీవనోపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు.
వ్యవసాయ పనులు సాగుతున్న సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు 60 రోజుల పాటు పనులను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంటుందని, మిగిలిన రోజుల్లో 125 రోజుల ఉపాధి హామీ అమల్లో ఉంటుందని వివరించారు. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయని తెలిపారు.
మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం, పారదర్శకత కోసం సోషల్ ఆడిట్, ఆధునిక సాంకేతికత వినియోగం ఈ పథకంలో ముఖ్యాంశాలని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజా ఆస్తుల సృష్టి, జీవనోపాధి బలోపేతం ద్వారా వికసిత భారత్-2047 లక్ష్య సాధనకు ఈ పథకం దోహదపడుతుందని అన్నారు.
జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. గ్రామీణ మహిళలు, యువత స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డులు, పనిదినాలు అందజేస్తామని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి, జీవనోపాధి పథకాల ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు శిక్షణా కార్యక్రమాలు, రుణ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈ పథకం ద్వారా అవకాశం కల్పిస్తున్నామని కలెక్టరు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ కె. వెంకట సుబ్బారావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె. షాజా నాయక్, అడిషనల్ పీడీ ఎం. రాజశేఖర్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, మహిళా రైతులు, కౌలు రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.