విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని పలు విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల లైసెన్సులు, ఫారాలు, ఇన్వాయిస్లు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.
విత్తనాల నిల్వలు వచ్చిన వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని డీలర్లకు సూచించారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో లాట్ నంబర్, పంట పేరు, వెరైటీ లేదా హైబ్రిడ్ వివరాలను బిల్లులో నమోదు చేసి, డీలర్తో పాటు రైతు సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.
నాసిరకం లేదా లూజు విత్తనాల విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు లైసెన్సు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి, బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు ఆ బిల్లును భద్రంగా ఉంచుకోవాలన్నారు.
ప్రత్తి సహా ఇతర పంటల విత్తనాలను అనధికారికంగా లూజుగా విక్రయిస్తే వాటిని నకిలీ విత్తనాలుగా పరిగణించి, సమాచారం అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు లూజు విత్తనాల కొనుగోలుకు దూరంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా, వివిధ వరి విత్తనాల నమూనాలను నాణ్యత పరీక్షల కోసం విత్తన పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ వెల్లడించారు.