వరి రైతులకు ముఖ్య సూచన – విత్తన శుద్ధి తప్పనిసరి: బి శివశంకర్
వరి రైతులకు ముఖ్య సూచనలుగా మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ విత్తన శుద్ధి తప్పనిసరి అని స్పష్టం చేశారు. వరి సాగు చేసే రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా షాపు నుండి బిల్లులు పొందాలని ఆయన సూచించారు. అలాగే విత్తనాల మొలక శాతాన్ని ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నారుమడి వేయడానికి ముందు విత్తన శుద్ధి చేయడం అత్యంత అవసరమని పేర్కొన్న ఆయన విత్తన శుద్ధి చేయడం ద్వారా గింజలపై ఉండే కంటికి కనిపించని సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు నశిస్తాయని చెప్పారు. దీంతో ప్రధాన పొలంలో పురుగుమందులు, శిలీంధ్ర నాశకాలు స్ప్రే చేసే ఖర్చు కూడా తగ్గుతుందని వివరించారు. విత్తన శుద్ధికి ట్రైఫ్లోక్సీ స్ట్రోబిన్ 25 శాతం + టేబుకోనజోల్ 50 శాతం మిశ్రమాన్ని 1 కేజీ విత్తనానికి 1 నుండి 1.5 గ్రాములు లేదా కార్బెండజిమ్ 50 శాతం (బావిస్టిన్) ను 1 కేజీ విత్తనానికి 2 నుండి 2.5 గ్రాములు వాడాలని సూచించారు. అలాగే కార్బెండజిమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల మోతాదులో ఉపయోగించవచ్చని తెలిపారు. విత్తనాన్ని శుద్ధి చేసిన తరువాత 24 గంటలు ఉంచి ఆపై విత్తుకోవాలని ఆయన సూచించారు. ఈ విధంగా విత్తన శుద్ధి చేయడం ద్వారా బ్లాస్ట్, కుళ్లు వంటి తెగుళ్లు తగ్గి పంటకు ఎటువంటి నష్టం లేకుండా మంచి మొలక శాతం పొందవచ్చని వ్యవసాయ శాఖ పేర్కొంది. కావున రైతులందరూ తప్పనిసరిగా విత్తన శుద్ధి పాటించాలని బి శివశంకర్ సూచించారు.