వరంగల్ రైల్వే స్టేషన్లో తప్పిపోయిన బాలుడు కుటుంబ సభ్యులకు అప్పగింత
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో ఈ నెల 3న తప్పిపోయిన బాలుడిని జీఆర్పీ పోలీసులు గుర్తించి రక్షించారు. అనంతరం బాలుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, మంగళవారం తండ్రి జితేందర్కు అప్పగించారు.
బిహార్కు చెందిన జితేందర్ తన భార్య, పిల్లలతో కలిసి ఉపాధి కోసం తమిళనాడుకు రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు వరంగల్ రైల్వే స్టేషన్లో ఆగిన సమయంలో నీరు తాగేందుకు బాలుడు రైలు నుంచి దిగాడు. అయితే రైలు బయలుదేరే సమయంలో తిరిగి ఎక్కలేకపోవడంతో బాలుడు స్టేషన్లో ఒంటరిగా మిగిలిపోయాడు.
బాలుడిని గమనించిన జీఆర్పీ పోలీసులు అతడిని రక్షించి, కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వివరాలు సేకరించారు. ఈ క్రమంలో బాలుడి తండ్రి జితేందర్ వరంగల్ చేరుకోవడంతో పోలీసులు బాలుడిని సురక్షితంగా అతడికి అప్పగించారు. బాలుడిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.