సావిత్రిబాయి పూలేను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి
NTODAY NEWS: జగిత్యాల జిల్లా
సావిత్రిబాయి పూలే 195వ జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను అభినందించారు. సావిత్రిబాయి పూలే 1831లో మహారాష్ట్రలోని నైగావ్లో జన్మించి, తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా బాలికల విద్య కోసం సామాజిక అడ్డంకులను అధిగమిస్తూ పోరాడిన మహనీయురాలని తెలిపారు. ఆమె జీవితం మహిళా హక్కులు, దళిత సాధికారత, సామాజిక న్యాయం కోసం సాగిన ఉద్యమానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమారి, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ వంటి మహిళా నాయకులను స్ఫూర్తిగా తీసుకోవాలని మహిళలకు సూచించారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అవార్డులు పొందిన మహిళా ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరింత ఉత్సాహంతో విద్యారంగంలో సేవలు అందించాలని కోరారు.
అనంతరం జిల్లాలోని 20 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత (రెవెన్యూ), అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి. రాజ గౌడ్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి రాము తదితర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube