యువతరం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
యువతరం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి: వక్తల పిలుపు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఏలూరులో కాగడాల ప్రదర్శన
ఏలూరు, మార్చి 23: అమరవీరుడు భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నేటి యువతరం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆయన 95వ వర్ధంతి సందర్భంగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితుల ఆధ్వర్యంలో నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
స్థానిక స్ఫూర్తి భవనం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రామచంద్రరావుపేట, రాయల్ టీ కార్నర్, చాపల తూము సెంటర్ మీదుగా భగత్ సింగ్ సెంటర్కు చేరుకుంది. అక్కడ భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ, భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను దేశం కోసం అర్పించిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సమాజంలో అన్యాయాలకు, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న యుద్ధాలు, దాడులపై భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని సూచించారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, అమెరికా–ఇజ్రాయిల్ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇరాన్ ప్రజలకు సంఘీభావంగా విద్యార్థులు, యువత గళం వినిపించాలని కోరారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సాయికుమార్ మాట్లాడుతూ, సమసమాజ స్థాపన కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విస్తృత జ్ఞానం సంపాదించుకోవాలని, క్రమశిక్షణ, అంకితభావంతో లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.