11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం
మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లాకు చెందిన అజిత్ జగతాప్, ప్రియాంక జగతాప్ దంపతులు తమ వివాహానంతరం అరుదైన ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణంగా నూతన దంపతులు హనీమూన్ కోసం విదేశీ పర్యటనలు, బీచ్ ప్రాంతాలను ఎంచుకుంటుండగా, ఈ జంట మాత్రం శివ భక్తితో 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం చెప్పులు లేకుండా పాదయాత్ర చేపట్టింది.
సుమారు 11,600 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది నెలల కాలంలో నడుచుకుంటూ పూర్తి చేశారు. ప్రతిరోజూ 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ మండుటెండలు, వర్షాలు, అలసటను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ శివునిపై ఉన్న అచంచలమైన విశ్వాసమే తమకు బలమైందని దంపతులు తెలిపారు.
గుజరాత్లోని సోమనాథ్ నుంచి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ వరకు, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించారు. ఈ యాత్రలో ప్రజల ప్రేమ, వివిధ రాష్ట్రాల సంస్కృతులు తమ జీవితానికి గొప్ప అనుభవాలను అందించాయని చెప్పారు.
“చాలాసార్లు అలసిపోయాం.. కిందపడిపోయాం.. కానీ జ్యోతిర్లింగాల దర్శనం చేయాలన్న సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించింది” అని అజిత్, ప్రియాంక పేర్కొన్నారు.
ఈ దంపతుల యాత్ర నేటి యువతకు దృఢ సంకల్పం, సంస్కృతి పట్ల గౌరవం, భార్యాభర్తల పరస్పర సహకారం ఎంత ముఖ్యమో చాటి చెబుతోంది. అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను కూడా పట్టుదలతో సాధించవచ్చని వారి ప్రయాణం నిరూపించింది.