48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు
48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు
ఆసిఫాబాద్, మార్చి 29:
కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కీలక మార్పులు చేపట్టింది. పథకం అమలు వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు సౌకర్యాలు పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
పథకం పేరును “వీబీజీ రామ్ జీ”గా మారుస్తూ, కార్మికులకు లభించే పనిదినాలను పెంచారు. వేతనాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆలస్యమైతే పరిహారం చెల్లించే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చారు.
అక్రమాలను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు ద్వారా క్షేత్ర సహాయకుడిని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసిన అనంతరం, ఉన్నతాధికారుల పరిశీలన తర్వాత జాబ్ కార్డు జారీ చేయనున్నారు.
ఈ మార్పులతో ఉపాధిహామీ పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవుతుందని అధికారులు పేర్కొన్నారు.