80ఏళ్ల సాగు భూములపై ‘22ఏ’ కత్తి…
80ఏళ్ల సాగు భూములపై ‘22ఏ’ కత్తి… రైతుల గగ్గోలు! ఎమ్మెల్యేను ఆశ్రయించిన కొండపర్వ రైతులు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణ సుధా అకాడమీలో జరిగిన కార్యక్రమం వేదికగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు గ్రామస్తులు, రైతులు కన్నీటి వినతిపత్రం సమర్పించారు. “తాతముత్తాతల భూములు… ఇప్పుడు మాకు కనిపించడం లేదు!” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడం హృదయ విదారకం అయింది. వివరాల్లోకి వెళితే… సర్వే నంబర్ 298/1/2లో ఉన్న సుమారు 100 ఎకరాల భూమిని రైతులు దాదాపు 80 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో చెట్టు పట్టాలు, తరువాత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో పాస్ పుస్తకాలు, రైతు భరోసా, ఎన్టీఆర్ జలసిరి బోర్లు—అన్నీ పొందిన ఈ రైతులకు ఒక్కసారిగా 2019లో ‘22ఏ నిషేధిత భూముల’ జాబితా రూపంలో పెద్ద షాక్ తగిలింది. దీంతో భూముల కొనుగోలు–అమ్మకాలు నిలిచిపోయాయి. ఆన్లైన్ రికార్డుల్లో పేర్లు మాయమైపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. “ఇది మా జీవనాధారం… దీన్ని ఇలా బ్లాక్ చేస్తే ఎలా?” అంటూ మండిపడ్డారు. “పట్టాలు ఇచ్చిన ప్రభుత్వాలు… ఇప్పుడు ఎందుకు మమ్మల్ని నిరాశపరుస్తున్నాయి?” అని రైతులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును రైతులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బోట్ల శివ సత్యనారాయణ, ధోనేల్లి రామారావు, సింహాద్రి శరత్ బాబు, పైడిపాల వెంకయ్య, పామర్తి లక్ష్మీనారాయణ, మరీదు రాజు తదితరులు పాల్గొన్నారు. రైతుల భూములపై ‘22ఏ’ బారిన పడిన సమస్య… పరిష్కారం ఎప్పుడు? ఇప్పుడు అందరి దృష్టి అధికారుల చర్యలపై ఉంది.