ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం.. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి చాట్రాయి ఎంపీడీవో బళ్ళా రాజు
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని చాట్రాయి మండలంలోని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఎంపీడీవో బళ్ళా రాజు కోరారు.
0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, బస్స్టాండ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్లలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు.
గతంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసినా, పల్స్ పోలియో కార్యక్రమంలో మరోసారి చుక్కలు వేయించడం అత్యంత అవసరమని తెలిపారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ చిన్నారులను పోలియో బూత్లకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఎంపీడీవో బళ్ళా రాజు విజ్ఞప్తి చేశారు.