ఆదర్శ కమ్యూనిస్టు మాచిబోయిన లక్ష్మీనారాయణ
తిరువూరు: తనకంటే పేదరికంలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు అందాలని, తన కుటుంబానికి అవసరమైనప్పటికీ సంక్షేమ పథకాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ఆదర్శ కమ్యూనిస్టు మాచిబోయిన లక్ష్మీనారాయణ అని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేకల నాగేంద్రప్రసాద్, సీనియర్ నాయకుడు సానికొమ్ము నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
లక్ష్మీనారాయణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం రాత్రి సంతాప సభ నిర్వహించారు. తొలుత సీనియర్ నాయకుడు గుళ్లపల్లి వెంకటరత్నం లక్ష్మీనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.
సంతాప సభలో నాగేంద్రప్రసాద్, నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మీనారాయణ 92 సంవత్సరాల వయసులోనూ పార్టీ నిర్వహించే ప్రజా సమస్యల పోరాటాలు, ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని తెలిపారు. ప్రజా సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
తన కుమారులకు పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని అధికారులు చెప్పినప్పుడు, తమకు ఆ పథకం అవసరం లేదని, తాము కష్టపడి సంపాదించిన దానితోనే ఇళ్లు నిర్మించుకుంటామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారని గుర్తుచేశారు. తమకంటే ఎక్కువ అవసరం ఉన్న పేదలకు ఆ ఇళ్లను మంజూరు చేయాలని కోరిన ఆయన నేటి రాజకీయాల్లో అరుదైన ఆదర్శంగా నిలిచిపోయారని కొనియాడారు.
స్వప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చిన లక్ష్మీనారాయణ ఆశయాలు, ఆదర్శాలను నేటి యువతరం అందిపుచ్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రజా నాట్యమండలి కళాకారులు లక్ష్మీనారాయణ త్యాగశీలత, ప్రజా సేవను స్మరిస్తూ ఆలపించిన గేయాలు కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్వీ భద్రం, ఎస్. వెంకటేశ్వర్లు, బి. వెంకటేశ్వరరావు, ఎ. రవి, పి. తులసీరాణి, ఎం. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.