ఆస్పత్రిలో నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లికి రెండేళ్ల జైలు శిక్ష
ఏలూరులో నవజాత శిశువును ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన ఘటనలో నిందితురాలికి గౌరవ మొబైల్ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది.
లింగాపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన బొల్లిన సాయి స్వాతి 2022 జూన్ 2న పీరియడ్స్ నొప్పిగా ఉందని చెబుతూ ఏలూరు ఎన్.ఆర్.పేటలోని చైత్ర ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చి, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పసికందును ఆస్పత్రిలోనే వదిలి పరారైంది.
ఈ ఘటనపై ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ మల్లెల లక్ష్మీ శ్రీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏలూరు త్రీ-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి త్రీ-టౌన్ సీఐ కేవీఎస్వీ ప్రసాద్ దర్యాప్తు చేపట్టి నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం పక్కా ఆధారాలతో మొబైల్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన గౌరవ మొబైల్ కోర్టు జడ్జి ఎన్. మేరీ సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితురాలిపై నేరం రుజువైనట్లు నిర్ధారించారు. ఈ మేరకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసులో ప్రభుత్వ తరఫున ఏపీపీ పి. హేమలత వాదనలు వినిపించారు.
ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, శిశువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కేసును వేగంగా విచారించి నిందితురాలికి శిక్ష పడేలా చేసిన త్రీ-టౌన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించినట్లు వెల్లడించారు.