ఏకే తండాలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
ఏకే తండాలో పరామర్శించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
రాయపర్తి మండలం AK తండాలో అమానుష ఘటన… బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 24 గంటల్లో నిందితుల అరెస్ట్కు కఠిన ఆదేశాలు..
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం AK తండాలో చోటుచేసుకున్న దారుణ ఘటన ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. గుగులోతు పూల్య, రజితల కుమార్తె మహేశ్వరి నిన్న రాత్రి సామూహిక అత్యాచారానికి గురై అనంతరం హత్య చేయబడిన ఘటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, ఆవేదన కలిగించింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే అత్యవసరంగా స్పందించి ఈరోజు ఉదయం ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు..
మహేశ్వరి మృతదేహం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే, ఘటనపై పూర్తి వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలి తల్లిదండ్రులు గుగులోతు పూల్య, రజితలను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. మీకు న్యాయం జరిగే వరకు నేను మీ వెంటే ఉంటాను. ఈ ఘటనలో నిందితులెవ్వరైనా సరే కఠినంగా శిక్షించబడేలా చూస్తాను అని హామీ ఇచ్చారు..
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరగా, ఎమ్మెల్యే అక్కడికక్కడే స్పందించి వరంగల్ పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. ఘటన తీవ్రతను వివరించి, వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులందరినీ అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ కేసులో ఎటువంటి ఆలస్యం సహించబోము. నిందితులు ఎంతటి వారైనా, ఎంత ప్రభావశీలులైనా చట్టం ముందు అందరూ సమానమే. ఏ పార్టీకి చెందిన వారైనా వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని స్పష్టంగా పేర్కొన్నారు..
అలాగే ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. మహిళల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, ప్రతి కేసును అత్యంత సీరియస్గా తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులందరినీ చట్టపరంగా శిక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..
24 గంటల్లోగా నిందితులందరినీ పట్టుకుని చట్టానికి లోను చేయాలి. ఇలాంటి అమానుష ఘటనలు గుర్తుకు వస్తేనే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉండాలి. పోలీస్ చర్యలు కూడా అదే విధంగా కఠినంగా ఉండాలి” అని ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించారు..
మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ ఘటనను కూడా అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనను హోంమంత్రి మరియు ముఖ్యమంత్రి దృష్టికి వెంటనే తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు..
బాధిత కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యేగా తన పూర్తి అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మహేశ్వరి కుటుంబానికి న్యాయం జరిగే వరకు నేను వెన్నంటి ఉంటాను. నిందితులు తప్పించుకునే అవకాశం ఉండదు. వారికి కఠిన శిక్ష పడేలా చూస్తాం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు..
ఈ ఘటనపై స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే జోక్యంతో ఈ కేసులో వేగంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు..